ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లదే... నా గొప్పతనం ఏమీ లేదు!: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

  • పదేళ్ల క్రితం ఎవరూ గుర్తు పట్టలేకపోయినా ఇప్పుడు తనతో కలిసి ఫొటోలు దిగుతున్నారన్న కాటిపల్లి
  • చనిపోయాక కూడా మనల్ని వందేళ్లు గుర్తుంచుకునే ఫీల్డ్ రాజకీయమని వ్యాఖ్య
  • దేశ చరిత్రలో ఒకేసారి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత తనకే దక్కిందన్న బీజేపీ ఎమ్మెల్యే
  • ఇద్దరు సీఎంలను ఇంతకుముందు ఎవరూ ఓడించలేదు... ఇకముందు కూడా ఓడించలేరన్న ఎమ్మెల్యే
తనను అందరూ జెయింట్ కిల్లర్ అంటున్నారని... పదేళ్ల క్రితం తన నియోజకవర్గంలో ఎవరూ గుర్తుపట్టలేకపోయినా... ఇప్పుడు విదేశాల్లో కూడా తనతో కలిసి ఫొటోలు దిగుతున్నారని... ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లదే అని... తన గొప్పతనమేమీ కాదని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. సాయిరామ్ శంకర్ నటించిన 'వెయ్ దరువెయ్' సినిమా ముందస్తు విడుదల వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మనం చనిపోయాక కూడా మనల్ని వందేళ్లు గుర్తుంచుకునే ఫీల్డ్ రాజకీయమని... మనం చేసే మంచిని ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటారన్నారు. అందుకే తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానని తెలిపారు. ఏదైనా ఉంటేనే కనిపిస్తుందని... కానీ మంచితనం మాత్రం మనం లేనప్పుడు కూడా కనిపిస్తుందన్నారు.

మన దేశంలోనే కాదు... ఈశాన్య రాష్ట్రాల వారు కూడా తనను గుర్తు పడుతున్నారన్నారు. ఎప్పుడూ గతాన్ని చూసుకొని... వర్తమానంలో నడుస్తూ... భవిష్యత్తును ఊహించుకునే వారు విజయవంతమవుతారన్నారు. మనకు పేరు... మంచితనం తప్ప ఏదీ శాశ్వతం కాదన్నారు. డబ్బులు కూడా శాశ్వతం కాదన్నారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టమన్నారు.

తన పార్టీ గెలిచి మంత్రి పదవి చేపట్టవలసి వస్తే సినిమాటోగ్రఫీ శాఖను తీసుకోవాలన్నది తన కోరిక అన్నారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత తనకే దక్కిందన్నారు. ఇంతకుముందు ఎవరూ ఓడించలేదు... ఇకముందు కూడా ఎవరూ ఓడించలేరన్నారు. ఈ సినిమా కూడా కామారెడ్డి నుంచి ప్రారంభమైందని, ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.

katipally venkata ramana reddy
Revanth Reddy
KCR
Kamareddy District

More Telugu News